కోల్ కతా అత్యాచార నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే ఊరుకునేదిలేదని ఫైర్
మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడి
లా కాలేజీ విద్యార్థిని కేసులో 12 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు వివరణ
పశ్చిమ బెంగాల్ లో మహిళలపై నేరాలకు పాల్పడే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పష్టం చేశారు. కోల్ కతా రేప్ కేసులో 12 గంటల్లోనే నిందితులు నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. నిందితులు తమ పార్టీకి చెందిన వారేనని ప్రచారం జరుగుతుండడంతో ‘నిందితులను కాపాడాలని ప్రయత్నిస్తే ఊరుకోబోం’ అంటూ తమ పార్టీ నేతలను ఆమె పరోక్షంగా హెచ్చరించారు. "మహిళలపై నేరాలను మా ప్రభుత్వం ఏమాత్రం సహించదు. నిందితులను మేం కాపాడం. రేపిస్టులను ప్రోత్సహించే సంస్కృతి బీజేపీదే" అని మొయిత్రా మండిపడ్డారు. మొయిత్రా వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
సౌత్ కలకత్తా లా కాలేజీ'లో జూన్ 25న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులు మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్లను అరెస్టు చేశారు. కోర్టు వారికి జులై 1 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi