ఊజీ ఈగ దెబ్బ.. టమోటాను పడేస్తున్న రైతులు!

టమాటా పంటను నష్టపరుస్తోన్న ఊజీ ఈగ

టమాటాలపై వాలి రంధ్రాలు చేస్తున్న ఊజీ ఈగ

ఏడోమైలు మార్కెట్‌ సమీపంలో టమోటాను పడేస్తున్న రైతులు

ANDRA PRADESH: ప్రస్తుతం టమాటా పంటను ఊజీ ఈగ తీవ్రంగా నష్ట పరుస్తోంది. ఊజీ ఈగ కారణంగా కోతకొచ్చిన పంట ఒక్కసారిగా దెబ్బతింటోంది. ఈ ఈగ వాలడంతో టమాటా కాయలు మొత్తం రంధ్రాలు పడుతున్నాయి. ఊజీ ఈగలు పచ్చి, దోర, పండు టమాటాలపై వాలి.. ఎక్కువగా రంధ్రాలు చేస్తున్నాయి. దీంతో కాయలు మెత్తబడి రంధ్రాల గుండా నీరు కారడం, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది.

ఇప్పటికే టమాటా పంటకు ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది చాలదన్నట్టు ఊజీ ఈగ వల్ల కాయ నాణ్యత పూర్తిగా పడిపోయింది. దీంతో మార్కెట్లో కొనే వారే ఉండటం లేదు. ఈ సీజన్‌లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా టమాటా సాగు చేసిన రైతులకు ఆశించిన దిగుబడే వచ్చింది. 

అయితే నాణ్యత లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో మార్గం లేక రైతులు గ్రేడింగ్‌ చేసి నాణ్యమైన పంటను విక్రయింస్తున్నారు. నాణ్యత లేని టమాటాను రోడ్ల పక్కన పడేస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడోమైలు మార్కెట్‌ సమీపంలో టమాటాను రైతులు పారబోశారు. చాలా ప్రాంతాల్లో ఊజీ ఈగ దెబ్బతో టమోటాలను రైతులు పారబోస్తున్నారు.