ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అకాడమీలో కమల్, ఆయుష్మాన్‌లకు చోటు


ఆస్కార్ సినిమాల ఎంపికలో ఓటు వేయనున్న భారతీయ నటులు

దర్శకురాలు పాయల్ కపాడియాకు కూడా అరుదైన ఆహ్వానం

ఈ ఏడాది కొత్తగా 534 మందికి సభ్యత్వం 

కొత్త సభ్యుల్లో 41 శాతం మహిళలు

వచ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ అవార్డుల ప్రదానం 

ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీలో భారతీయ నటులకు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో పాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ ఆహ్వానం అందింది. ఈ మేరకు ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ తాజాగా విడుదల చేసిన కొత్త సభ్యుల జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి మొత్తం 534 మంది ప్రతిభావంతులను ఆహ్వానించినట్లు అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ జాబితాలో భారత్ నుంచి కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాలతో పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా స్థానం సంపాదించారు. అకాడమీలో సభ్యత్వం పొందిన వీరందరికీ ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల దశ నుంచి తుది విజేతలను ప్రకటించే వరకు జరిగే ఓటింగ్‌లో వీరు పాలుపంచుకుంటారు.

ఈ ఏడాది ఆహ్వానం పొందిన 534 మందిలో నటీనటులు, దర్శకులతో పాటు మొత్తం 19 విభిన్న విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఉన్నారని అకాడమీ వివరించింది. అంతేకాకుండా కొత్తగా చేరిన సభ్యుల్లో 41 శాతం మహిళలు ఉండటం గమనార్హం. ఇది అకాడమీలో వైవిధ్యాన్ని పెంచే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగమని తెలుస్తోంది. ప్రపంచ సినిమాకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులను అకాడమీలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఇక, వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న జరగనుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జనవరి 12 నుంచి 16 వరకు కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలన అనంతరం తుది జాబితాను జనవరి 22న అధికారికంగా ప్రకటిస్తారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi