ప్రేమాలయంలో ఓటుహక్కు వినియోగంఫై వృద్దులతో అవగాహన సదస్సు


ఏలూరు: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా స్వీప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ చెప్పారు. ఆదివారం, స్థానిక వృద్ధాశ్రమంలో (ప్రేమాలయం) స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఓటుహక్కు వినియోగంఫై వృద్దులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో స్వీప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పాల్గొని మాట్లాడారు. 


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బలమైన ప్రజాస్వామ్యం కోసం అర్హులైన పౌరులందరు ఓటు హక్కు వినియోగించుకునే దిశగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో 92 శాతం ఓటింగ్ జరిగే విధంగా స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని, అందులో భాగంగా అన్ని వర్గాల ఓటర్లకు అవగాహన కలిగించేందుకు జనసామర్ద్యం కలిగిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఓటర్లతో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో గత 40 రోజుల నుంచి 1,757 పైగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.  ప్రభుత్వాల నుంచి వివిధ సేవలు హక్కుగా ఎలా కోరుకుంటామో అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తెరగాలన్నారు.



ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఏమైనా పిర్యాదులు వుంటే సి విజిల్ యాప్ ద్వారా పిర్యాదు చేసే అవకాశం కల్పించబడిందన్నారు. సి విజిల్ ద్వారా అందే పిర్యాదులను 100 నిమిషాల లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా వాట్సాప్ మెసేజ్, ఫొటోలు ద్వారా ఎన్నికలకు సంబంధించిన నిజమైన, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలు 9491041435 వాట్సాప్ నెంబరుకు కూడా పంపవచ్చన్నారు. జిల్లాలో సజావుగా ప్రశాంతవాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం. ముక్కంటి మాట్లాడుతూ 85 సంవత్సరాలు దాటినా వృద్ధ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం భారత ఎన్నికల సంఘం కల్పించిందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం. ముక్కంటి, ప్రేమాలయం అధినేత వెంకటేష్ గురూజీ, ఏలూరు తహశీల్దారు ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.