ఏలూరు జిల్లా, ఏలూరు: మానవతా ధృక్పధంతో కొల్లేరు సమస్య చిక్కుముడిని అందరి సమిష్టి కృషితో పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. శనివారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో దిశ సమావేశం అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్బంగా ఎంపి పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కొల్లేరుకు సంబంధించి వివిధ అంశాలపై స్ధానికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని వాటిని ఒక్కోక్కటిగా పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు.కొల్లేరుకు సంబంధించి అంశం సుప్రీం కోర్టులో నడుస్తున్నదని, వారి సూచనలు మేరకు సంబంధిత సమాచారాన్ని సమర్పించేందుకు కొంత సమయం కోర్టులో వెసులుబాటు కలిగిందన్నారు. ఈ సున్నితమైన సమస్య పరిష్కరించడానికి చాలా సమయం పట్టేటట్లు కనబడుతున్నప్పటికీ నూరుశాతం సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు.
గతంలోకన్నా భిన్నంగా అన్ని సమస్యలపై దిశ సమావేశంలో సంబంధిత అధికారులతో అర్ధవంతమైన సమీక్ష జరిగిందన్నారు. కేంద్రం నుంచి అమలు చేసే ప్రతిపధకం ప్రజలకు అందుతున్నాయాలేదా అని సమీక్షించుకుని ఎక్కడైనా అందకపోతే ఏమిచేయాలనే ఆలోచనకూడా చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పారిశ్రామికరంగం అభివృద్ధి, యువతకు ఉపాధికల్పించే అంశాలు అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వారు సానుకూల ధృక్పధంతో స్పందించడం జరిగిందని చెప్పారు.
ఈ మేరకు ఏప్రిల్ 10వ తేదీన కనీసం వెయ్యిమందికి ఉపాధికల్పించేలా మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో 4వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్న పరిశ్రమలు ఉన్నాయని, వాటి నుంచి కనీసం 2 శాతం తప్పనిసరిగా సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో చర్యలు వేగవంతం చేయాలని, సంబంధిత నిధులు జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంచి రైతులకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే పలురహదారులు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, పూర్తిగా దెబ్బతిన్న రహదారుల అభివృద్ధి చేసే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.