ఏలూరు: ప్రజలందరికీ మంచి జరగాలనే అత్యున్నత ఆశయంతో పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించడం ఎంతో గొప్పవిషయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఇదేరీతిలో ఎల్లప్పుడు హిందూ, ముస్లింలు అన్నదమ్ముల భావనతో కలిసికట్టుగా మరింత ముందుకు పయనించాలని ఆకాంక్షించారు.
ఏలూరు కత్తేపువీధిలోని జామియా మసీదులో పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.
అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి జరగాలనే అత్యున్నత ఆశయంతో ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వహించడం ఎంతో గొప్పవిషయమన్నారు. పేదవానికి సాయం చేయాలనే సిద్ధంతాన్ని రంజాన్ బోధిస్తుందని గుర్తుచేశారు. ఇదేక్రమంలో హిందూ, ముస్లింలు సోదరభావనతో కలిసికట్టుగా మరింత ముందుకు పయనించాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, కో - ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, త్రిపర్ణ రాజేష్, మారం అను, ముస్లిం మత పెద్దలు ఎస్కె జావెద్ అహ్మద్, జానీ, పాషి, యాసీన్ తదితరులు పాల్గొన్నారు.