ANDRAPRADESH: ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కొంటోంది. మూడు పార్టీలు తమ భవిష్యత్ కోసం కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా టీడీపీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. బీజేపీ పూర్తిగా పట్టు పెంచుకుంటోంది. కూటమి పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని జగన్ అంచనా వేస్తున్నారు. వరుస కేసుల తో తమ పార్టీ కేడర్ ను ఇబ్బంది పెడుతున్నారని భావిస్తున్న జగన్.. ఇక ప్రభుత్వం పై పోరు బాట కు సిద్దమయ్యారు. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపు ముహూర్తం ఖరారైంది. ముందుగా కూటమి కంచుకోటల పైనే జగన్ ఫోకస్ చేసారు.
జగన్ కీలక నిర్ణయం
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కానుంది. జూన్ 12 తో కూటమి ప్రభుత్వం కొలువు తీరి సంవత్సరం అవుతుంది. ఈ ఏడాది పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ అంచనాగా కనిపిస్తోంది. హామీల అమలు లో వైఫల్యం.. రెడ్ బుక్ పేరుతో వరుస కేసులతో పాలన పూర్తిగా వదిలేసారని జగన్ ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలు.. కేడర్ పైన కేసులతో రాజకీయ ప్రతీకారానికి దిగుతున్నారని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని.. ఈ సారి ఖచ్చితంగా కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇస్తున్నారు. ఈ ఏడాది కాలంలో జగన్ పరామర్శలకు మాత్రమే జిల్లాలకు వెళ్లారు. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రజల్లోనే ఉండేలా
జగన్ సంక్రాంతి నుంచే జనంలోకి వెళ్లాలని.. ప్రతీ పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలతో రెండు రోజు ల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లటం సరి కాదనే అభిప్రాయం పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తం అయింది. దీంతో ,జగన్ జిల్లాల పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇక.. వరుసగా పార్టీ నేతల పైన కేసులు నమోదు అవుతున్న వేళ పార్టీ కేడర్ లో మనోధైర్యం నింపాల్సిన అవసరం పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ తాజాగా చర్చించారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఏడాది సమయం పూర్తి కావటంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని.. జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించే లా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు దాదాపు ముహూర్తం ఫిక్స్ చేసారు.
కూటమి కంచుకోటల్లో
ఇక నుంచి జిల్లాల్లోనే ఉండటం ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని జగన్ భావిస్తున్నారు. కేసులు.. హామీల విస్మరణ గురించి నిలదీయాలని డిసైడ్ అయ్యారు. జూలై 8న వైఎస్సార్ జన్మ దినం నాడు జగన్ జిల్లాల పర్యటన ప్రారంభించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ నేతల సమాచారం. తొలి విడతలో కూటమి కంచుకోటల్లోనే జగన పర్యటన ఉండేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు. అక్కడే తమ బలం చాటాలని భావిస్తున్నారు. అదే విధంగా ప్రతీ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు. గోదావరి లేదా శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం పల్నాడు పర్యటన తరువాత జగన్ జిల్లాల పర్యటన పైన అధికారికంగా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.