ANDRAPRADESH: ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులు ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటివి చేయడం తెలిసిందే. దాదాపు ప్రతీ ఎన్నికల సమయలోనూ ఈ విషయం రొటీన్ గా కనిపిస్తుంది! ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది కూడా కాకముందే వైఎస్ షర్మిల యాత్రకు సిద్ధమవుతున్నారు!
ఏపీలో వైఎస్ జగన్ త్వరలో పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జమిలి వస్తే ముందుగానే ఎన్నికలు రావొచ్చనే ఊహాగాణాల మధ్య జగన్ ఆ దిశగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. అది కాకుండా.. ప్రజా సమస్యలపై జగన్ రోడ్లపైకి వచ్చి పోరాడింది ఈ ఏడాది కాలంలో పెద్దగా లేదనే చెప్పాలి! ప్రెస్ మీట్ పెట్టి సూపర్ సిక్స్ అమలు కాలేదని, ఎన్నికల హామీలన్నీ గాలికి వదిలేశారని విమర్శించడం మినహా.. జగన్ రోడ్డుపైకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించింది లేదనే చెప్పాలి! ఈ క్రమంలో జగన్ కంటే ముందుగా వైఎస్ షర్మిళ జనాల్లోకి రానున్నారు! ఇందులో భాగంగా... జూన్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్త యాత్రను ప్రారంభించనున్నారు.
జూన్ 9న వైఎస్ షర్మిళ రాష్ట్రవ్యాప్త పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్ర చిత్తూరులో ప్రారంభమై.. జూన్ 30న కృష్ణా జిల్లాలో ముగుస్తుంది. అయితే జూన్ లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని అంటున్న వేళ.. ఈ యాత్రకు ప్రకృతి సహకారం ఏ మేరకు అనేది వేచి చూడాలి! మరోపక్క.. ఈ యాత్ర వైసీపీకి సరికొత్త సమస్యగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాలం పూర్తవ్వబోతున్న వేళ.. సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రజా సమస్యలపై ఆమె గళమెత్తాలని నిర్ణయించుకున్నారు. దీంతో.. ఈ యాత్ర సక్సెస్ అయితే అది జగన్ కు పెద్ద సమస్యే అని అంటున్నారు పరిశీలకులు.