ANDRAPRADESH: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్ బుక్ అంటేనే వైసీపీ నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కడపలో టీడీపీ మహానాడు బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ... గత వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు.
2024లో మాస్ విక్టరీ సాధించామని... 94 శాతం స్ట్రైక్ రేట్తో చరిత్రను తిరగరాశామని... ఇది టీడీపీ కార్యకర్తల నాటు దెబ్బ అని అన్నారు. టీడీపీ జెండా పీకేస్తామని, పార్టీ లేకుండా చేస్తామని అన్నారని.... కానీ వారే అడ్రస్ లేకుండా పోయారని వైసీపీపై విమర్శలు గుప్పించారు. వై నాట్ 175 అన్నవారికి... ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు.
తల్లిని, చెల్లిని మెడ పట్టుకుని బయటకు గెంటేసింది ఎవరు?, సొంత బాబాయ్ను లేపేసింది ఎవరు?, జే బ్రాండ్లు అమ్మి పేదలు రక్తం తాగింది ఎవరు?, బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజలను బాదింది ఎవరు? అని టీడీపీ శ్రేణులను లోకేష్ ప్రశ్నించారు.
ఎర్ర బుక్పై వైసీపీ నేతలకు ఎందుకంతా ఏడుపు అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తను ఇబ్బంది పెట్టినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆనాడూ తాను చెప్పానని అన్నారు. అయితే ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా... ఎర్ర రంగును చూస్తేనే వైసీపీకి వణికిపోయే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు.
‘‘ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండెపోటు వచ్చింది... ఎర్ర బుక్ అంటే ఒకడు బాత్రూమ్లో కాలు జారి చేయి విరగొట్టుకున్నాడు... ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు... అర్థమైందా రాజా, అర్థమైందా రాజా...’’ అని లోకేష్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తమ ఇంటి తలుపు ఎప్పటికీ తెరిచే ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు. ‘‘గ్రామ పార్టీలో సమస్య ఉంటే మండల పార్టీని కలవాలి. మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి. నియోజకవర్గ కమిటీకి సమస్య ఉంటే జిల్లా కమిటీని కలవాలి. వాళ్ల దగ్గర కూడా సమస్య పరిష్కారం కాకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను కలవాలి. ఆయన వల్ల కూడా కాకపోతే... మీ లోకేష్ మీకు అండగా నిలబడతాడు. మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను’’ అని నారా లోకేష్ చెప్పారు.