వెన్నుపోటు పిలుపు...జగన్ వైపు చూపు

ANDRAPRADESH: వైసీపీ అధినాయకత్వం జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా భావిస్తోంది. ఎందుకంటే 2024 జూన్ 4న సరిగ్గా ఆ రోజునే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమిని మూటకట్టుకుంది. టీడీపీ కూటమి అద్భుతమైన విజయం సాధించింది. అయితే సూపర్ సిక్స్ హామీలతో పాటు అనేక అలవి కానీ హామీలను ఇచ్చి మరీ టీడీపీ కూటమి జనాలకు గత ఏడాది కాలంగా వెన్నుపోటు పొడించిదని ఒక్క పధకం అయినా అమలు చేయలేదని ఆరోపిస్తూ విపక్ష పార్టీగా వైసీపీ వెన్నుపోటు దినోత్సవాన్ని జూన్ 4న చేస్తోంది. అంటే ప్రజా తీర్పు వచ్చిన రోజును టీడీపీ కూటమి వెన్నుపోటు పొడిచిన రోజుగా పేర్కొంటున్నారు అన్న మాట. 

వెన్నుపోటు పేరుతో ప్రతీ జిల్లాలో మండల కేంద్రాలలో నిరసనలు చేయాలని అధినాయకత్వం ఇప్పటికే పిలుపు ఇచ్చింది. దానికి తగినట్లుగా ఎక్కడికక్కడ పోస్టర్లు ఆవిష్కరిస్తూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ హడావుడి చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ వైసీపీ ఓటమి పాలు అయ్యాక జగన్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. గత ఏడాది కాలంగా ఆయన పెద్దగా జనంలోకి రాలేదని గుర్తు చేస్తున్నారు. నాయకులు జైళ్లకు వెళ్తే ములాకత్ లు పరామర్శలు వంటివి తప్పించి ఆయన జనంలోకి రాలేదని అంటున్నారు. ఇక ఈ ఏడాది కాలంలో అసెంబ్లీ మూడు నాలుగు సార్లు సమావేశం అయితే జగన్ ఆయన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఒక డిమాండ్ ని అక్కడ పెట్టారు. 

దాంతో జగన్ ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసింది కూడా పెద్దగా కనిపించలేదని అంటున్న వారూ ఉన్నారు. అయితే జగన్ మాత్రం మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. ఆయన వాణిని అక్కడ బిగ్ సౌండ్ తో వినిపిస్తున్నారు. కానీ ఇది చాలదని అంటున్నారు. ఏడాది కూటమి పాలన పూర్తి అయిన సందర్భంగా అయినా జగన్ జనంలోకి వస్తేనే వైసీపీకి జోష్ వస్తుందని అంటున్నారు. ఇక వెన్నుపోటు నిరసన కార్యక్రమాలలో జగన్ కూడా ఎక్కడో ఒక చోట పాల్గొంటే బాగుంటుందని అపుడే ఆ కార్యక్రమం హైలెట్ అవుతుందని అంటున్నారు. లేకపోతే ఎంత హైప్ ఇచ్చినా కూడా అది పెద్దగా జనాలకు ఎక్కదని అంటున్నారు. గతంలో కూడా ఫీజు రీఎంబర్స్ మెంట్ మీద రైతుల సమస్యల మీద వైసీపీ పోరాటాలను నిరసనలకు పిలుపు ఇచ్చింది. కానీ పార్టీ నాయకులు చేసిన ఆ కార్యక్రమాలు పెద్దగా ఫోకస్ కాలేకపోయాయని గుర్తు చేస్తున్నారు. 

ఇక జగన్ జనంలోకి వచ్చేందుకు ఇది ఒక మంచి అవకాశంగా చెబుతున్నారు. ఇంతకీ జగన్ బయటకు వచ్చి నిరసనలో పాల్గొంటారా అన్నదే చర్చగా ఉంది. జగన్ రాకపోతే మాత్రం వెన్ను పోటు ప్రొగ్రాం కూడా పెద్దగా కిక్కు ఇవ్వదని అంటున్నారు. ఘనమైన బరువైన పేరుగా వెన్నుపోటు అని పెట్టారు. ఆ నిరసనలు జయప్రదం కావాలంటే అధినాయకత్వమే అందుకు పూనుకోవాలని అంటున్నారు. ఇప్పటికే వైసీపీలో ఒక రకమైన నిస్తేజపూరితమైన వాతావరణం ఉంది అని అంటున్నారు. దానిని పారదోలాల్సిన బాధ్యత హై కమాండ్ మీదనే ఉంది అని అంటున్నారు. అధినేత జోక్యం లేకుండా చేసే ఏ కార్యక్రమం అయినా మొక్కుబడిగా తూతూమంత్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంతకీ జగన్ ఇపుడైనా బయటకు వస్తారా అంటే వెయిట్ అండ్ సీ.