INDIA NEWS: ప్రధాని మోదీపై, బీజేపీ నేతలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్భం వచ్చినప్పుడల్లా సంచలన విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మరో ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్న ఈ క్రమంలోనే మోదీ వర్సెస్ దీదీ అనే రీతిలో మాటల యుద్ధం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన సందర్భంగా దీదీపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మమత లేదని అర్థం వచ్చేలా షాకింగ్ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మమత ప్రభుత్వం ఉందని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో హింస, మత ఘర్షణలు, అవినీతి రాజ్యమేలుతున్నాయని, దీదీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది అని ప్రజలు కూడా భావిస్తున్నారని మోదీ అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ లో మత ఘర్షణలు జరిగయి. దీదీ సర్కార్ ఉదాసీనత వల్లే ఆ అల్లర్లు చెలరేగి మత ఘర్షణలు జరిగాయని మోదీ నిందించారు. ఆ ఘర్షణలపై కలకత్తా హైకోర్టు నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఎంసీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే, నాయకులే మతపరమైన ఘర్షణలకు కారణమని ఆ నివేదికలో ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే దీదీపై మోదీ విరుచుకుపడ్డారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కొన్ని ఇళ్ళను గుర్తించి తగలబెడుతుంటే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని, అది ఎంత భయానక పరిస్థితో అర్థం చేసుకోవాలని మోదీ అన్నారు. ప్రభుత్వాన్ని ఇలాగేనా నడిపేది అన్ని ప్రశ్నించారు. దీదీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని, బుజ్జగింపు రాజకీయాల పేరు చెప్పి గూండాలకు స్వేచ్ఛనిచ్చారని ఆరోపించారు. బెంగాల్ లో కోర్టు జోక్యం లేకుండా ఏ సమస్య పరిష్కారం కావడం లేదని మోదీ అన్నారు.
అయితే, మోదీ వ్యాఖ్యలపై దీదీ వెంటనే కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు సత్తా ఏంటో తేలుతుందని దీదీ జవాబిచ్చారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుందని, రాష్ట్ర ప్రజలు తన వెంట, తన పార్టీ వెంట ఉన్నారని బలంగా నమ్ముతున్నానని దీదీ చెప్పారు.