చంద్రబాబు ఈసారి టీ కాచేది అక్కడేనట !

ఈ విధంగా ప్రతీ నెలా బాబు పెన్షన్ పంపిణీ కోసం వెళ్తూ సరికొత్త వ్యూహాలనే అమలు చేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు సామాజిక పెన్షన్లను పెద్ద ఎత్తున సొమ్ము పెంచడమే కాదు తానే స్వయంగా ఆయా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మరీ వాటిని అందిస్తున్నారు. అలా 2024 జూలై నుంచి బాబు ప్రజల వద్దకే వెళ్తున్నారు. పేదల ఇంట్లో కూర్చుని వారితో కబుర్లు ఆడుతూ వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు

అంతే కాదు, వారి యోగ క్షేమాలను అడుగుతున్నారు. వారి వంటింటికి వెళ్ళి తానే స్వయంగా టీ కాచి ఇస్తున్నారు. అలా చంద్రబాబు ప్రతీ నెలా పెన్షన్ పంపిణీ చేస్తూ తాను ప్రజలకు బాగా దగ్గర అయిపోయారు. తమ ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి వస్తూండడంతో పేదల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. వారి సమస్యలను అక్కడికక్కడే తీరుస్తూ బాబు వారికి అదృష్ట దేవుడుగా మారుతున్నారు.

కేవలం ఆ కుటుంబం వారికే కాదు సమీపంలో ఉన్న ఇతర ఇళ్ల వారు కూడా అక్కడకి వస్తే అందరి మధ్యన రచ్చ బండ తరహా సమావేశాలు జరుపుతున్నారు. ప్రభుత్వం పనితీరు తెలుసుకుంటున్నారు. అంతే కాదు వారికి పధకాలు అందుతున్నాయా లేదా వాకబు చేస్తున్నారు.

ఈ విధంగా ప్రతీ నెలా బాబు పెన్షన్ పంపిణీ కోసం వెళ్తూ సరికొత్త వ్యూహాలనే అమలు చేస్తున్నారు. ఇప్పటిదాకా రాయలసీమ కోస్తా గోదావరి జిల్లాలలో పర్యటించిన చంద్రబాబు మొదటిసారి అల్లూరి సీతారామరాజు జిల్లాకు వస్తున్నారు.

చంద్రబాబు జూలై 1వ తేదీన అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో పెన్షన్ పంపిణీ చేస్తారు అని అంటున్నారు. ఆ విధంగా ఆయన తొలిసారి గిరిజన ప్రాంతాలలో పెన్షన్ లబ్దిదారులకు అందిస్తూ వారి సాధక బాధకాలను తెలుసుకుంటారు అని అంటున్నారు.

మన్యంలో అనేక సమస్యలు ఉన్నాయి. మారుమూల తండాలు ఉన్నాయి. ఈ రోజుకీ వారు రోగులను ఆసుపత్రులకు తరలించాలీ అంటే డోలీలనే ఆశ్రయిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా చోట్ల రోడ్లను వేస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ చాలా సార్లు మన్యం ప్రాంతాలలో పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంతాలలో రహదారులను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సైతం నిధులు మంజూరు చేశారు.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi