ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
ఇదివరకు గన్నవరానికి చెందిన మాజీ శాసన సభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కటకటాల వెనక్కి వెళ్లారు. వారంతా విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నివాసంలో కొద్దిసేపటి కిందటే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను అనంతపురానికి తరలించారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం మధ్య రాజకీయపరమైన గొడవలు ఉన్న విషయం తెలిసిందే. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డిని తాడిపత్రికి రానివ్వబోనని, ఆయనను కాలుపెట్టనివ్వనని తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే
దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని హైకోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చానని కేతిరెడ్డి పెద్దారెడ్డి వివరించారు. తాను ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తాడిపత్రిలో ఉండకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టారని అన్నారు.
ఏదో ఒక కారణంతో తనను సొంత నియోజకవర్గానికి దూరం చేస్తోన్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాడిపత్రిలో తనకు ఉన్న ప్రజల మద్దతును చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. సంవత్సర కాలం తరువాత తాడిపత్రికి వెళ్తే అక్కడ ఉండనివ్వలేదని చెప్పారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. ఇది ఎంతో కాలం సాగబోదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా మద్దతును కోల్పోయిందని, అరెస్టులకు పాల్పడుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi