సింగయ్య ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నాననే కారణంతో తనపై కేసు నమోదు చేయడం సరికాదని, దీన్ని కొట్టేయాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న వాదనలు జరిగాయి. అయితే దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకూ జగన్ అరెస్టు కాకుండా ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ప్రమాదానికి కారణమైన వైఎస్ జగన్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో దీనికి ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు.
జగన్ కారుకు నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో గతేడాది ఈ వాహనం రిజిస్ట్రేషన్ జరిగిందని గుర్తించారు. అలాగే 2027 వరకూ ఇన్సూరెన్స్ ఉందని, 2039 వరకూ ఫిట్ నెస్ కూడా ఉందని తేల్చారు. కాబట్టి కారు ఫిట్ నెస్ అనేది ప్రమాదానికి కారణం కాదని తేల్చారు. అయితే మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రవాణాశాఖ అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా కార్యకర్తలు భారీగా కారుపైకి వచ్చేందుకు యత్నించడం వల్ల అక్కడక్కడా దెబ్బలు తగిలాయని తేల్చారు. సింగయ్య ప్రమాదం తర్వాత కూడా జగన్ సహా వైసీపీ నేతలు అందులో ప్రయాణించినట్లు గుర్తించారు.
జగన్ ప్రయాణించిన కారు వల్లే సింగయ్య చనిపోయాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసుల్ని హైకోర్టు సమగ్ర నివేదిక కోరింది. దీంతో కారు ఫిట్ నెస్ టెస్టు కూడా చేసారు. అనంతరం పోలీసులు సిద్ధం చేసే తుది రిపోర్టును న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించబోతున్నారు. దీని ఆధారంగా బుధవారం హైకోర్టు జగన్ సహా ఇతర నిందితుల క్వాష్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే హైకోర్టు.. ఈ కేసులో కారులో ప్రయాణించిన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది.