భీకర బాంబులతో ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం: అమెరికా


ఆపరేషన్ మిడ్‌నైట్‌ హ్యామర్‌' వివరాలు వెల్లడించిన రక్షణ శాఖ

అణు కేంద్రాలపై బంకర్ బస్టర్, మాసివ్ బాంబులతో దాడి

ఇస్ఫహాన్‌పై అత్యంత శక్తిమంతమైన బాంబుల ప్రయోగం

ఆపరేషన్‌లో పాల్గొన్న 125కు పైగా యుద్ధ విమానాలు

ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్'కు సంబంధించిన వివరాలను అమెరికా రక్షణ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ ఆపరేషన్ లో అత్యంత శక్తిమంతమైన బాంబులను ప్రయోగించినట్లు యూఎస్ చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కేన్ ధ్రువీకరించారు.

జనరల్ కేన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫోర్డో మరియు నతాంజ్‌లలోని అణు స్థావరాలపై 'బంకర్ బస్టర్' బాంబులను వాడారు. ఇస్పహాన్ అణు కేంద్రాన్ని ఇరాన్ అత్యంత లోతుగా నిర్మించిందని, ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి మరింత శక్తిమంతమైన బాంబులు వాడామని చెప్పారు. 'మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్' (ఎంఓపీ) బాంబులు, తొమాహాక్ క్షిపణులను ప్రయోగించి ఇస్ఫహాన్ ను ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో దాదాపు 60 శాతం ఇస్ఫహాన్‌లోనే ఉండటంతో, దానిని ప్రత్యేకంగా లక్ష్యం చేసుకున్నట్లు వివరించారు.

ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన అనంతరం ఈ ఆపరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ దాడిలో ఏడు బీ2 బాంబర్లతో సహా మొత్తం 125కు పైగా యుద్ధ, నిఘా విమానాలు పాల్గొన్నాయని రక్షణ శాఖ తెలిపింది. దాదాపు 30 వేల పౌండ్ల బరువున్న 14 భారీ బాంబులను అణు కేంద్రాలపై జారవిడిచినట్లు అధికారులు తెలిపారు. కేవలం కొన్ని గంటల్లోనే ఆపరేషన్ పూర్తిచేసి తమ విమానాలు ఇరాన్ గగనతలం నుంచి సురక్షితంగా బయటకు వచ్చేశాయని జనరల్ కేన్ స్పష్టం చేశారు.

ఈ దాడుల వల్ల ఇరాన్ అణు కార్యక్రమానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం కానప్పటికీ, వాటిని పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతుందని యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల ప్రాథమిక అంచనా.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi