ANDHRAPRADESH:ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి ఇప్పటి కే సమాచారం ఇచ్చింది. ఏపీలో బీజేపీ కోరుకున్న విధంగా రాజ్యసభ సీట్ల కేటాయింపులో సహకరిం చిన టీడీపీకి.. గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉండగా..పార్టీ సీనియర్ నేతకు అవకాశం దక్కను న్నట్లు తెలుస్తోంది.
బీజేపీ ఆఫర్
ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. త్వరలో కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం చేపట్టేందుకు సిద్దమైంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. బీహార్ తో పాటుగా త్వరలో మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. పార్టీలో జాతీయాధ్యక్షుడు మొదలు.. అన్ని నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. మిత్రపక్షాలకు సైతం గవర్నర్లు.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. 2014-19 కాలంలో నే టీడీపీకి నాడు గవర్నర్ పదవి పైన బీజేపీ హామీ ఇచ్చింది. అయితే, ఆ తరువాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటక వచ్చేసింది. ఫలితంగా నిర్ణయం అమలు కాలేదు.
గతంలో ఇచ్చి అమలు చేయని హామీ ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ పదవి ఆఫర్ కేంద్రం నుంచి టీడీపీకి ఆఫర్ అందింది. టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నట్లు సమా చారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతి రాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా..ఆర్దిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతి రాజు కేంద్రంలో నూ టీడీపీ మంత్రిగా పని చేసారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు.
ఆయనకే ఛాన్స్
అశోక్ గజపతి రాజు, యనమల కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడుగా పదవీ విరమణ చేసారు. తనకు రాజ్యసభకు అవకాశం ఇస్తే కొన సాగుతానని.. లేకపోతే, రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని యనమల స్పష్టం చేసారు. ఇక, అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇస్తే..యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గత పదేళ్ల కాలంలో విద్యాసాగర రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనా రెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. కాగా, టీడీపీలో ముఖ్య నేతగా.. వివాదారహితుడుగా పేరున్న అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని పార్టీ నేతల సమాచారం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా మార్పు జరిగే అవకాశం లేదు. అయితే, సీఎం చంద్రబాబు పార్టీలో చర్చించిన తరువాత అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi