ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే పథకాలు, కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రజల విద్యుత్ భారం తగ్గించే దిశగా చర్యలు మొదలు పెట్టింది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి సోలార్ వెలుగుల్ని అందించాలని భావిస్తోంది. సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎస్సీలు, ఎస్టీలకు పీఎం సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీలు అందిస్తోంది. తాజాగా మరో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది కూటమి ప్రభుత్వం.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతుండగా.. విడతల వారీగా డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ను అమర్చాలని ప్లాన్ చేసింది. తొలి విడతగా లక్ష మందికి ఈ టాప్లను అమర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు సోలార్ రూఫ్ టాప్ల వల్ల కలిగే ఉపయోగంపై సెర్ప్ అధికారులు అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఈ పథకం కోసం ఓకే చెప్పిన డ్వాక్రా మహిలకు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 80వేలమంది వరకు ఈ పథకం కోసం సమ్మతిని తెలియజేశారు. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్ ప్యానళ్లు అమరిస్తే.. వాటిలో 400 ఇళ్లు డ్వాక్రా మహిళలవే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో కూడా ప్యానళ్ల అమర్చే పనులు కొనసాగుతున్నాయి.
కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ యోజన గృహ వినియోగదారులకు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకంలో భాగంగా మూడు రకాల కెపాసిటీతో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసేందుకు రాయితీ అందిస్తున్నారు. ఒక కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు ఉంటే.. అందులో రూ.30 వేల రాయితీ లభిస్తుంది. రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ రూ.1.40 లక్షలు కాగా రాయితీ రూ.60 వేలు ఉంటుంది. అదే మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్టాప్ ఏర్పాటు కోసం వ్యయం రూ.1.95 లక్షలు కాగా.. రాయితీ రూ.78 వేలు వస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్టాప్ సామర్థ్యాన్ని నిర్ణయించుకోవచ్చు.
పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద.. లబ్ధిదారు వాటా 10 శాతం పోనూ, మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. ఈ రుణాన్ని అందించే బాధ్యత సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) అధికారులుది. ఒకవేళ లబ్ధిదారులు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరతున్నారు.