బెంగాల్‌లో భద్రతా దళాలపై ముస్లిం ఆందోళనకారులు దాడి.. వీడియోను ఇప్పుడు జరిగినట్లు తప్పుగా వైరల్..


తీర్పు:

పశ్చిమ బెంగాల్‌లో భద్రతా దళాలు కూడా సురక్షితంగా లేవని వైరల్ చేస్తున్న వీడియో ఇప్పటిది కాదని.. కరోనా వేళ 5 ఏళ్ల క్రితం లాక్‌డౌన్ విధించినప్పుడు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు జరిగినట్లు తప్పుగా వైరల్ చేస్తున్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాలను కట్టడి చేసేందుకు గతంలో ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు చేసింది. అయితే కేంద్రం తీసుకువచ్చిన ఈ చట్టంపై ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ చట్టాన్ని నిరసిస్తూ దేశంలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లో అయితే తీవ్ర హింసాత్మక సంఘటలు చోటు చేసుకోగా.. అందులో ముగ్గురు చనిపోయారు. అయితే తాజాగా కొంతమంది గుంపు.. భద్రతా బలగాలు, పోలీసులను అడ్డుకుని.. వారిని వెనక్కి తరిమికొట్టినట్లు ఉన్న వీడియో వైరల్ అవుతోంది.

క్లెయిమ్ ఏంటి?
పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా అక్కడ మోహరించిన పోలీసులు, భద్రతా బలగాలకు కూడా రక్షణ లేదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. "పశ్చిమ బెంగాల్‌లో భద్రతా దళాలకు కూడా రక్షణ అవసరం. రాజ్యాంగాన్ని, చట్టాలను సుప్రీంకోర్టు ఎలా తయారు చేసింది? ఐక్యంగా ఉంటే సురక్షితంగా ఉంటారు" అని అరుణ్ యాదవ్ అనే వ్యక్తి ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇక ఇదే వీడియోను ఇలాంటి వాదనలతోనే చాలామంది నెటిజన్లు షేర్ చేశారు.

నిజం ఏంటి?
భద్రతా బలగాలు, పోలీసులను బెంగాల్ వాసులు తరిమికొట్టిన విషయం నిజమే అయినప్పటికీ ఆ వీడియో ఇటీవల జరిగింది కాదని సజగ్ ఫ్యాక్ట్‌చెక్‌లో వెల్లడైంది.

వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ
వైరల్ అవుతున్న వీడియోలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునేందుకు మా సజగ్ టీమ్ విస్తృతంగా పరిశోధనలు జరిపింది. ఆ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్‌లో సెర్చ్ చేయగా.. ఆ వీడియోకు సంబంధించిన కొన్ని వార్తలు, సోషల్ మీడియా లింక్‌లు కనిపించాయి. అయితే ఆ వీడియో ఇప్పుడు తీసింది కాదని.. 5 ఏళ్ల క్రితం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో లాక్‌డౌన్ విధించినప్పుడు తీసినట్లు వెల్లడైంది.

దీనికి సంబంధించి ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ 2020 ఏప్రిల్ 28వ తేదీన ఒక ట్వీట్ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని టికియాపారా ప్రాంతంలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ ఒక మార్కెట్‌లో ప్రజలు గుంపులు గుంపులుగా చేరారు. దీంతో వారిని చెదరగొట్టి ఇళ్లకు తిరిగి వెళ్లమని చెప్పినప్పుడు.. స్థానికులు పోలీసులు, భద్రతా బలగాలపై దాడి చేసి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

అదే సమయంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్, బీజేపీ ఎక్స్ హ్యాండిల్ ద్వారా చేసిన ట్వీట్‌లో కూడా ఇదే రకమైన సమాచారం కనిపించింది. ఎన్డీటీవీ, ది వైర్ వంటి వార్తా సంస్థలు కూడా ఈ వీడియోతో పాటు ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించాయి.