హైదరాబాద్ మనకు లేదు..బాబు సంచలన వ్యాఖ్యలు


ANDRAPRADESH: అదే ఏపీకి ఎక్కడ నుంచి రావాలి అన్నదే బాబు అధికారులను ప్రశ్నించారు. హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలని ఆయన సూచించారు. BY: BCN TV NEWS ఉమ్మడి ఏపీకి హైదరాబాద్ ఒక అతి పెద్ద ఆర్థిక చోదక శక్తి. హైదరాబాద్ అంటే ఈ ప్రపంచంలో ఒక మాదిరి దేశం కిందనే లెక్క. సర్వం అక్కడ ఉంటాయి. ఇక తెలంగాణాకు ఈ రోజున నూటికి 75 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోంది. అలాంటి హైదరాబాద్ ని ఏపీ కోల్పోయి 11 ఏళ్ళు అయింది. ఇక ఏపీకి అమరావతి అన్న రాజధానిని రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం చూస్తోంది. అయితే అమరావతి రాజధాని తయారు కావాలీ అంటే కొంత సమయం పడుతుంది. ఇక ఆ రాజధాని నుంచి ఫలాలు రావాలీ అంటే మరింత కాలం పడుతుంది. మరి కొత్త రాష్ట్రం ఏపీలో ఖర్చులు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. 


ఏ ఖర్చూ ఆగదు కదా. పైగా విభజన ఏపీకి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలలో పేదరికం ఉంది. సంక్షేం అన్నది కచ్చితంగా అమలు చేయాలి అదే విధంగా పూర్తిగా వ్యవసాయిక దేశంగా ఉన్న ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలంటే మౌలిక సదుపాయాలను పెంచాలి. దానికి నిధులు పెద్ద ఎత్తున అవసరం పడతాయి. ఇంకో వైపు చూస్తే ఏపీలో అన్నీ మొదటి నుంచే అమలు చేయాల్సి ఉంది. ప్రతీదీ సమకూర్చి పెట్టుకోవాలి. ఇది పాలకులకు నిజంగా బిగ్ టాస్క్. ప్రతీ దానికీ అప్పుల కోసం వెళ్ళడం వల్ల వడ్డీలు పెరిగిపోతున్నాయి. కేంద్ర సాయం ఎంత ఆశించినా దానికి కూడా ఒక విధానం ఉంది. ప్రమాణాలు ఉన్నాయి. దాంతో ఏపీ సొంతంగా ఎదగాలి. 

ఆదాయాలను పెద్ద ఎత్తున పెంచుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆలోచనతో ఉన్నారు. ఆయన అధికారులను కోరుతోంది ఒక్కటే. ఆదాయ మార్గాలు వెతకండి. ప్రతీ రూపాయి ఖాజానకు చేరాల్సి ఉంది. ఇందుకోసం అన్ని రకాలుగా అధ్యయనం చేయమని అంటున్నారు. తాజాగా అమరావతిలో అధికారులతో చంద్రబాబు చేసిన సమీక్షలో ఇదే విషయం చెప్పారు. ఆదాయం ఎంతగా పెరిగితే అంతలా ఏపీ అభివృద్ధి చెందుతుంది సంక్షేమ పధకాలను కూడా అమలు చేయగలమని బాబు అంటున్నారు. తెలంగాణాకు చూస్తే హైదరాబాద్ ఉంది. మొత్తం ఆదాయంలో ముప్పావు వంతు హైదరాబాద్ నుంచే వస్తోంది. 

అదే ఏపీకి ఎక్కడ నుంచి రావాలి అన్నదే బాబు అధికారులను ప్రశ్నించారు. హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలని ఆయన సూచించారు. ఆదాయం పెరగడానికి అవకాశం ఉన్న ప్రతీ రంగాన్ని ఏ మాత్రం వదలకుండా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఇక ఈ ఏడాది ఏకంగా 1,34, 208 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా చేసుకోవాలని బాబు దిశా నిర్దేశం చేశారు. అంతే కాదు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పన్నులు ఎగవేసే వారికి చెక్ పెట్టాలని కోరారు. ప్రతీ పైసా పన్ను కట్టాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. 

ఏపీ నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్ళు జరుగుతున్నాయని మరి పన్నులు కట్టే వారు విషయం చూస్తే ఆశించిన రేటు ఎందుకు లేదని బాబు అధికారులని నిలదీస్తున్నారు. అంతే కాదు ఏపీకి ఆదాయ వనరుగా ఉన్న ఎర్ర చందనం విక్రయంలో కూడా అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించేలా కమిటీని ఏర్పాటు చేయాలని కూడా బాబు కోరారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి మాత్రమే సొంతమని దీనిని విక్రయించడం ద్వారా పెద్దఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు. ఇక ఆదాయం పెంపుదల కోసం గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన కోరారు. 

ఏపీకి ఆదాయ వనరులు ఏ విధంగా సమకూరుతాయో బాబు వివరించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా ఆదాయం లభించడానికి దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఏపీలో అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని ప్రతిశాఖకు ఏఐ బృందం ఉండాలని బాబు సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని బాబు ఆదేశించారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు తక్కువుగా ఆదాయం వస్తోందని బాబు ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. 

దీనికి కారణాలు అన్వేషించి వెంటనే సరైన విధానాలను అవలంభించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. ఆదాయార్జనకు నెలవారీ లక్ష్యాలను పెట్టుకుంటూ వాటిని అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని బాబు కోరరు. ఇదిలా ఉంటే ఏపీలో కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలై ఇప్పటికి రెండు నెలలు దగ్గర పడుతోంది. అయితే ఈ సమయంలో ఏప్రిల్ 1 నుంచి మే 11 వరకు వాణిజ్య పన్నులు, అటవీ ఆదాయంలో తగ్గుదల కనిపించగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అనూహ్యంగా ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు. 

దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకతో పోల్చుకుంటే ఏపీలో ఎక్సైజ్ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉందని ఈ సమీక్షలో తేలింది. 2025-26 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి 2 వేల 116 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ద్వారా 33 వేల 882 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. మొత్తం మీద చూస్తే ఏపీలో ఆదాయం ఈ ఏడాది బాగా పెంచుకోవాలని బాబు చేసిన సూచనలతో అధికారులు ఆ దిశగా భారీ యాక్షన్ ప్లాన్ తో రెడీ అవుతున్నారు.