INDIA NEWS, భోపాల్: కల్నల్ సోఫియా ఖురేషి పై BY: BCN TV NEWS అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా కు ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారంనాడు షాక్ ఇచ్చింది. మంత్రిపై సాయంత్రంలోగా ఎఫ్ఐఅర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశించింది. ఎఫ్ఐఅర్ నమోదు చేయడంలో విఫలమైతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తమకు మరింత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అందుకు జస్టిస్ అతుల్ శ్రీధరన్ నిరాకరించారు. ''ఈ అంశం అర్జెన్సీని గుర్తించుకోండి.. రేపటికి నేను ఉంటానని గ్యారెంటీ ఏదైనా ఉందా'' అని ప్రశ్నించారు. మతం పేరుతో ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించరాదనే భారతీయ న్యాయసంహిత సెక్షన్ 196కు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పడు మీడియాకు తెలియజేస్తూ వచ్చిన కల్నల్ ఖురేషిపై విజయ్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఖురేషిని ''ఉగ్రవాదుల చెల్లెలు'' అంటూ మంత్రి సంబోధించారంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అందుకు సంబంధించి వీడియో క్లిప్ను కూడా షేర్ చేసింది. ''ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచి వేస్తే.. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని పంపించి గట్టి గుణపాఠం చెప్పాం'' అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సైతం తీవ్రంగా ఖండించింది.