త్వరలో గ్యాప్ 1 నిర్మాణ పనులు ప్రారంభం.. ప్రస్తుతం కొనసాగుతున్న మట్టి తవ్వకం పనులు


పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్) నిర్మాణ పనులు చేపట్టేందుకు అనువుగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనిని గురువారం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్  ఈఈ  డి.శ్రీనివాస్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్  లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) జనరల్ మేనేజర్ గంగాధర్  ఈ సందర్భంగా  డీ వాటరింగ్ జరిగే ప్రాంతంలో పూజలు నిర్వహించారు. 

ఆ తరువాత నీటి తోడకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటార్ల ద్వారా  ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ గ్యాప్ 1 నిర్మించాలంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య నిర్మాణ ప్రాంతంలో నీటి లెవల్ తక్కువగా ఉండాలి. ప్రస్తుతం అక్కడ 16 మీటర్ల కంటే ఎక్కువ నీటి లెవల్  ఉంది. అది 15 మీటర్ల కంటే  తక్కువకు చేరే వరకు నీటి తోడకాన్ని చేపడతారు. ఈ సి ఆర్ ఎఫ్ లో భాగంగా  గ్యాప్ 1 నిర్మాణాన్ని ఆ వెంటనే చేపడతారు.  

నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనువుగా ప్రస్తుతం మట్టి తవ్వకం పనులు గ్యాప్ 1 నిర్మాణ ప్రాంతంలో  జరుగుతున్నాయి.   ప్రస్తుతం నీటి నిల్వలను తగ్గించేందుకు శక్తీ వంతమైన మోటార్లను వాడుతున్నారు.  80 హార్స్ పవర్ సామర్ధ్యం ఉన్న  మొత్తం 180 మోటార్లను నీటి తోడకానికి వినియోగించనున్నారు.  ఇప్పటికే 86 మోటార్లను సిద్ధం చేశారు. తొలిరోజు  15 మోటర్లతో  నీటి తోడకం ప్రారంభించారు. నీటి తోడకం పెంచేందుకు  మోటర్లను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.