మావోయిస్టులమంటూ ఆగంతుకుడి బెదిరింపు
మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నట్లు తెలిపిన వ్యక్తి
దమ్మాయిగూడలో కార్యక్రమంలో ఉండగా ఫోన్
డీజీపీ, ఎస్పీలకు రఘునందన్ రావు ఫిర్యాదు
మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత రఘునందన్ రావుకు సోమవారం బెదిరింపు కాల్ రావడం సంచలనం కలిగించింది. మావోయిస్టుల పేరుతో ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, ఆయన్ను అదే రోజు సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై రఘునందన్ రావు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ), మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
రఘునందన్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, మావోయిస్టునని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, రఘునందన్ రావును సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడు.