మోదీ భారతదేశ ఆస్తి.. ప్రధానిపై మరోమారు ప్రశంసలు కురిపించిన శశిథరూర్

మోదీ శక్తి, చైతన్యం దేశానికి ప్రధాన ఆస్తి అన్న కాంగ్రెస్ ఎంపీ

'ది హిందూ' పత్రికలో ఈ మేరకు వ్యాసం రాసిన థరూర్

'ఆపరేషన్ సింధూర్' ప్రచారంలో భాగంగా ఐదు దేశాల పర్యటన అనంతరం స్పందన

దేశ భవిష్యత్ ప్రపంచ వ్యూహానికి టెక్, ట్రేడ్, ట్రెడిషన్ మూలస్తంభాలని సూచన

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్థాన్‌కు సంబంధించి భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' ప్రపంచ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఐదు దేశాల్లో పర్యటించి వచ్చిన ఆయన, తాజాగా 'ది హిందూ' పత్రికలో ఒక వ్యాసం రాశారు. ఇందులో ప్రధాని మోదీని ‘భారత్‌కు ప్రధాన ఆస్తి’గా అభివర్ణించారు.

ప్రధాని నరేంద్ర మోదీ శక్తి, చైతన్యం, నిమగ్నత ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రధాన ఆస్తిగా నిలుస్తాయని, అయితే దీనికి మరింత దన్ను అవసరమని శశి థరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. 'ఆపరేషన్ సింధూర్' పేరిట చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం, ప్రపంచ వేదికపై భారతదేశ ఐక్యతను చాటిచెప్పిందని ఆయన నొక్కి చెప్పారు. ఈ పర్యటన ద్వారా తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు థరూర్ తెలిపారు.

ఐక్యతలో ఉన్న శక్తి, స్పష్టమైన సంభాషణల ప్రభావం, సాఫ్ట్ పవర్ వ్యూహాత్మక ప్రాముఖ్యత, నిరంతరాయమైన ప్రజా దౌత్యం ఆవశ్యకత వంటి అంశాలు ప్రస్తుత సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత్‌కు మార్గనిర్దేశం చేస్తాయని తాను గ్రహించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రచార యాత్ర ద్వారా అంతర్జాతీయ సమాజంతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అవకాశం కలిగిందని థరూర్ అభిప్రాయపడ్డారు.

భారతదేశ భవిష్యత్ ప్రపంచ వ్యూహాన్ని నడిపించడంలో మూడు 'టి'లు - టెక్ (సాంకేతికత), ట్రేడ్ (వాణిజ్యం), ట్రెడిషన్ (సంప్రదాయం) కీలక పాత్ర పోషించాలని థరూర్ సూచించారు. మరింత న్యాయమైన, సురక్షితమైన, సంపన్నమైన ప్రపంచం కోసం భారత్ కృషి చేస్తున్న తరుణంలో ఈ మూడు అంశాలు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన తన వ్యాసంలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత, అధికార పార్టీకి చెందిన ప్రధానిని ఇలా బహిరంగంగా ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.