యూకేకి బయల్దేరిన కేటీఆర్


ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరంలో కీలక ఉపన్యాసం ఇవ్వనున్న కేటీఆర్

తెలంగాణ ప్రగతిని వివరించనున్న వైనం

పెట్టుబడులు, పారిశ్రామిక విధానాలపై చర్చ

HYDERABAD:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగనున్న 'ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025' సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు.

'భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు' అనే ప్రధాన ఇతివృత్తంతో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్, గతంలో తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారనే అంశాలపై మాట్లాడతారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొనే ఈ సదస్సులో, సాంకేతికత ద్వారా భారతదేశం సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించగలదనే విషయంపై విస్తృతంగా చర్చించనున్నారు. కేటీఆర్ తన పర్యటన ముగించుకుని ఈ నెల 24న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.