ANDRAPRADESH: కూటమి పాలనలో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు సంగతేమో గానీ, ప్రత్యర్థులపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారు. మాట ఎత్తితే చాలు, అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేయడాన్ని ఎవరూ విమర్శించరు. కానీ రాజకీయంగా బెదరగొట్టి, తద్వారా ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే ఎత్తుగడలో భాగంగా కేసులతో ఇబ్బంది పెడుతున్నారనే చర్చకు తెరలేచింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని లాంటి నాయకులు న్యాయస్థానం పుణ్యమా అని జైలుకు వెళ్లలేదు. లేదంటే ఈ పాటికి ఆయన కూడా జైలు జీవితాన్ని అనుభవించి వుండేవాళ్లు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే మూడు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఆయనపై ఒక దాని తర్వాత మరొకటి కేసు పెట్టడం, జైలు నుంచి బయటికి రాకుండా ఎలా అడ్డుకుంటున్నారో చూస్తున్నాం.
తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని అరెస్ట్ చేశారు. త్వరలో అరెస్ట్ అయ్యే జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి బ్రదర్స్ను ఇరికించిన సంగతి తెలిసిందే. టీడీపీలోని రెండు వర్గాల ఆధిపత్య పోరు… జంట హత్యలకు కారణమని స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులే మీడియాకు చెప్పారు.
ఆ తర్వాత మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఒత్తిడి మేరకు పిన్నెల్లి బ్రదర్స్ను కేసులో ఇరికించినట్టు వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. అన్నదమ్ములిద్దరి అరెస్ట్ తప్పదనే చర్చకు తెరలేచింది. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యపరంగా కోలుకున్నారని, ఆయన్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా కృష్ణా జిల్లా పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఆయన అరెస్ట్ ప్రచారానికి బలం కలిగిస్తున్నాయి.