తలపై పెట్రోల్ పోసుకుని నిరసన... మణిపూర్ లో మళ్లీ ఎందుకీ ఉద్రిక్తతలు?


INDIA NEWS, MANIPUR: గతంలో తీవ్ర సంచలనంగా మారిన మణిపూర్ వ్యవహారం సంగతి తెలిసిందే. కుకీ, మైటీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో మణిపూర్ ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే తర్వాత గత కొంతకాలంగా కాస్త నిశబ్ధంగానే ఉన్నట్లు కనిపించిన ఆ ప్రాంతంలో మరోసారి హైటెన్షన్ వాతావారణం మొదలైంది. దానికి కారణం ఏటీ కీలక సభ్యుడిని అరెస్ట్ చేయడం అని అంటున్నారు.

అవును... మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో మరోసారి హైటెన్షన్ వాతావారణం నెలకోంది. శనివారం రాత్రి అరంబై టెంగోల్ (ఏటీ) కీలక నాయకుడిని అరెస్ట్ చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు ఒక్కసారిగా లేచాయి. ఈ సమయంలో ఏటీ నాయకుడు ననన్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా యువకులు, మైటీ స్వచ్ఛంద సేవకులు నిరసనలకు దిగారు.

దీంతో శనివారం రాత్రి 11:45 గంటల తర్వాత నుంచి ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, కాక్చింగ్, బిష్ణుపూర్ అనే ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ఈ నిలిపివేత ఐదు రోజుల పాటు ఉంటుందని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ద్వేషపూరిత సందేశాలు, రెచ్చగొట్టే చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇలా శనివారం రాత్రి భద్రత దళాలు ఏటీ నాయకుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ సమయంలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి టైర్లను, పాత సామానులను తగులబెట్టి రోడ్లను దిగ్భంధించారు. నిరసన దృశ్యాల్లో... నల్లటి టీషర్టులు ధరించిన యువకుల గుంపు పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని, అందులోని పెట్రోల్ తలపై పోసుకోవడం కనిపించింది.

ఈ సందర్భంగా... మేము ఆయుధాలు వదులుకున్నాము.. వరదల సమయంలో మీరు చేయాల్సిన పనిని తామే చేశాము.. ఇప్పుడు మీరు తిరిగి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు.. మమ్మల్ని మేమే చంపుకుంటాము అని చెబుతూ వారి వారి తలలపై పెట్రోల్ పోసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన ఏటీ... 2023 మే నెలలో జాతి హింస ప్రారంభ రోజుల్లో చట్టం అమలులో అసమర్థత కారణంగా గ్రామ వాలంటీర్లుగా ఆయుధాలు చేపట్టవలసి రావడంతో ఏర్పడిన సంస్థ ఇది అని తెలిపింది. చట్టం అమలు సరిగ్గా లేకపోవడంతో మైటీ గ్రామాలు.. కుకీ మిలిటెంట్ల దాడులకు గురయ్యాయని చెబుతోంది.

కాగా గత పది సంవత్సరాలుగా మణిపూర్ లో దాదాపు అంతరించిపోయిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), కాంగ్లీ యవల్ కన్న లూప్ (కేవైకేఎల్), కాంగ్లీపాక్ కమ్యునిస్ట్ పార్టీ (కేసీపీ) వంటి నిషేదిత మైటీ మిలిటెంట్ గ్రూపులు కూడా మే 2023 తర్వాత మయన్మార్ నుంచి తిరిగి వచ్చాయని.. సైనిక దళాల పట్టు తగ్గడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు.