బెంగుళూరు తొక్కిస‌లాట.. త‌ప్పెవ‌రిది?


INDIA NEWS, BENAGLURU: అభిమానుల అత్యుత్సాహం, ప్రభుత్వ ఏర్పాట్లలో లోపం వల్ల బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 11 మంది మరణించగా, 50 మందికిపైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది.


ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ… టైం తక్కువ ఉండటంవల్ల సరైన ఏర్పాట్లు చేయలేకపోయామని, ఆటగాళ్ల కమిట్‌మెంట్ల వల్ల ఈ రోజే వేడుక నిర్వహించాల్సి వచ్చిందన్నారు. స్టేడియం సామర్థ్యం 35 వేలే అయినా 2 లక్షల మందికిపైగా వచ్చారన్నారు. వారిని అదుపు చేయలేకనే ఈ ఘటన జరిగింది అన్నారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు, గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.

తొక్కిసలాట ఘటనపై పీఎం నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ… మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు. కాగా, ఈ ఘటనపై వెంటనే బీజేపీ రాజకీయం ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని, ప్రభుత్వ చేతులకు రక్తం అంటుకుందని ఘాటు విమర్శలు చేసింది.

తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం తో పాటు జనాల తొందరపాటు కూడా కారణమవుతుంది. ఇదే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్‌లో ఓ భోలే బాబా సత్సంగ్‌లో వంద మందికిపైగా చనిపోయిన విషయం తెలిసిందే. గత నెలలో కూడా బీజేపీ పాలిత గోవాలో ఆరుగురు తొక్కిసలాటలో మరణించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటన జరగడంలో ప్రభుత్వ వైఫల్యంతో పాటు ప్రజల నిర్లక్ష్యమూ కారణం. కానీ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా ప్రభుత్వంపైనే ఉంటుంది.